అంతరాల సమాజానికి సంపద పంపిణీ చికిత్స

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మనదేశంలో 3 లక్షల మందిని బలితీసుకుంది. ఇవి ప్రభుత్వ లెక్కలు. ప్రయివేటు సంస్థల లెక్కలు అనేక రెట్లు ఎక్కువగా వున్నాయి. కోవిడ్‌ తొలిదశ ముగిసిందనుకున్నాం. మలిదశ మరింత ప్రళయంగా వచ్చింది. ఆసుపత్రులలో మంచాల కొరత, ఆక్సిజన్‌ కొరత, వెంటిలేటర్ల కొరత, స్మశానాలలో శవాల గుట్టలు, గంగానదిలో తేలుతున్న శవాలు ఇవి కనిపించే దృశ్యాలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.
కరోనా విలయంలో ఇది ఒక వైపు చిత్రం మాత్రమే. మరొపక్క ఈ విలయం కోటాను కోట్ల ప్రజల జీవనాన్ని కకావికలం చేసింది. దాని పరిణామాల మీద తగిన చర్చ లేకుండా పోయింది.
దేశంలో 50 కోట్లమంది ఉపాధిరంగంలో వుంటే అందులో 45 కోట్ల మంది (90శాతం) అసంఘటితరంగంలో వున్నారు. రోజువారీ కూలీలుగా వున్నారు. అజీంప్రేమ్‌జీ యూనివర్శిటీతోసహా అనేక ప్రామాణిక సంస్థలు చేసిన సర్వేల ప్రకారం మధ్యతరగతిగా వున్నా 3 కోట్ల మంది గత ఏడాది కాలంలో పేదరికంలోకి దిగజారిన స్థితి ఆందోళన కలిగిస్తున్నది .
అసంఘటిత కార్మికుల సంపాదన తగ్గిపోవడంతో వీరిలో 40 శాతం మంది ఒకపూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు. గతంలో పొదుపు సొమ్ము చిల్లర ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. స్థానిక వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీలతో అప్పులు చేస్తున్నారు.
ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే ఆకలిచావుల ప్రమాదం పొంచి వుందని, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు పెరిగే స్థితి వుందని, పోషకాహార లోపంతో పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో మరణాలు వుంటాయని ఇది కరోనా మరణాలకు మించి వుండే ప్రమాదంగా పలువురు పేర్కొంటున్నారు.
కోవిడ్‌ కల్లోలం ప్రకృతి ప్రసాదితం దానికి చికిత్స అవసరం. అలాగే పేదరికం, అంతరాల అగాధాలు దోపిడీ వ్యవస్థ ప్రసాదితాలు . దానికి తగ్గ శస్త్ర చికిత్స కూడా తక్షణ అవసరం అయింది. లేకపోతే మూకుమ్మడి ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగేలా ఈ పేదరికం కోటాను కోట్లమందిని నడిపిస్తుంది.
పేదరికం, అంతరాల అగాధాలపై చర్చ గత దశాబ్దకాలంగా ప్రపంచ వ్యాపితంగా మొదలైంది. సంక్షిప్తంగా ఆ నేపథ్యాన్ని పరిశీలించుకుందాం.
1990 దశకంలో సోషలిస్టు దేశాలు పతనం అయ్యాయి. మరోపక్క పెట్టుబడి ప్రపంచీకరణ ఊపు అందుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వతం అనీ, దానికి ప్రత్యామ్నాయం లేదనీ, అది సాధించే అభివృద్ధి ఫలితాలు తిరిగి ప్రజలపై వర్షిస్తుందనీ అది అంతరాలను; పేదరికాన్ని తొలగిస్తుందనీ దాని సిద్ధాంతకర్తలు ఊదరగొట్టారు. మార్క్స్ భావజాలానికి కాలం చెల్లిందని ప్రగల్భాలు పలికారు.
2008లో అమెరికాతో సహా పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక మాంద్యంతో సంక్షోభంలో పడ్డాయి. వేతన స్తంభనలూ, సంక్షేమాల కోతల వంటి చిట్కాలు వారిని గట్టెక్కించలేకపోయాయి.
మార్క్స్ భావాలకు కాలం చెల్లిందన్నవాళ్లే యీ సంక్షోభాన్ని అర్థం చేసుకోడానికి "పెట్టుబడి" గ్రంధాన్ని చదవాలని ప్రకటించారు. సంపద కొద్దిమంది చేతుల్లో పేదరికం అత్యధిక సంఖ్యాకుల దగ్గర పేరుకుపోవడాన్ని గుర్తించడం మొదలైంది.
ఈ దశలో పికెట్టీ రాసిన "21వ శతాబ్దపు పెట్టుబడి" పుస్తకం వెలువడింది. పెట్టుబడి సృష్టించిన అంతరాల అగాధాన్ని అది బట్టబయలు చేసింది. మరోపక్క ఆక్స్‌ఫాం సంస్థ ప్రపంచంలో 1 శాతం మంది దగ్గర 70 శాతం సంపద పోగుపడ్డ తీరునీ కోటానుకోట్ల మందిని పేదరికంతో ముంచిన స్థితిని తన నివేదికలలో వెల్లడించింది.
దీంతో పలుదేశాలలో ఈ అంతరాల అగాధాన్ని ,పేదరికాన్ని తొలగించే మార్గాలుగా నగదు బదిలీలు, కనీస మౌలిక ఆదాయాన్ని అందించే ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగాలు సంపద కేంద్రీకరణ మీద దాడి చెయ్యడానికి బదులు "పన్నుల సొమ్ము" పంపిణీ ద్వారా సాధించాలని భావించాయి. అది శిరోభారం కావడంతో ప్రభుత్వాలు ఆ ప్రయోగాలను మధ్యలోనే వదిలిపెట్టాయి.
ఈ నేపథ్యంలో భారతదేశంలో సంపద కేంద్రీకరణ పర్యవసానాలను పరిశీలించుకోవాలి.
కరోనా సంక్షోభానికి ముందే సంపద కేంద్రీకరణ మీద, పేదరికం మీద చర్చ ప్రారంభం అయింది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం మనదేశంలో 10 శాతం దగ్గర 77 శాతం దేశ సంపద పోగై వుంది. 2017లో దేశంలో పెరిగిన సంపదలో 1 శాతం దగ్గర 73 శాతం పోగుపడింది. అంతరాల అగాధాలు, పేరుకుపోతున్న పేదరికాన్ని తగ్గించడానికి నగదు బదిలీలు, మౌలిక ఆదాయ కల్పన వంటి అంశాలపై చర్చ మొదలైంది.
1. పన్నుల సొమ్ము - సాధ్యంకాని పరిష్కారం
2017 బడ్జెట్‌కి ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే నివేదికలో పేదరికంలో వున్న కుటుంబాలకు నగదు బదిలీ చేసే మౌలిక ఆదాయ కల్పన మీద ఒక అధ్యాయాన్ని కేటాయించి చర్చించారు. "పన్నుల సొమ్ము"తో మౌలిక ఆదాయ కల్పన సాధ్యం కాదన్నది అంతిమంగా తేలిపోయింది. అందుకే బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేకుండాపోయింది. కేంద్రప్రభుత్వ బడ్జెట్‌లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేదల మౌలిక ఆదాయకల్పనకు ఖర్చు చేసే స్థితి లేదు. ఎందుకంటే కార్పొరేట్‌ పన్నుకు వరుసగా రాయితీలు ఇచ్చి దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోడానికి అప్పుల మీద, ప్రభుత్వరంగం ఆస్తుల అమ్మకం మీద కొన్ని ఎంపిక చేసిన సంక్షేమ పథకాల కుదింపు మీద ఆధారపడే స్థితి వచ్చింది. పైగా బడ్జెట్‌కు ఒక రాజకీయ లక్ష్యం కూడా వుంది. అది కొన్ని బృందాలకు నగదు బదిలీ ద్వారా "ఓటు బ్యాంకు"లను ఏర్పరచుకోవడం, ఎన్నికల నిధులు సమకూర్చుకోడానికి కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు ప్రకటించడం, బడ్జెట్లు వీటికే పరిమితం అవుతున్నాయి. అంతకుమించి దీర్ఘకాలికమైన మౌలిక ఆదాయ పథకాన్ని నెత్తికెత్తుకునే స్థితి దానికి ఎంతమాత్రమూ లేదు. పైగా దోపిడీదారులు సృష్టించిన అంతరాల అగాధాన్ని, పోగుపడ్డ సంపద పింపిణీతో నిమిత్తం లేని ఏ పరిష్కారమైనా అంతరాలను తొలగించకపోగా దానిని మరింత పెంచుతుంది.
2. పారిశ్రామిక లాభాల పంపిణీ
పారిశ్రామికరంగంలో కార్మికులకు బోనస్‌ అన్న సమస్య మీద దాదాపు 50 సంవత్సరాలు చర్చ జరిగింది. బోనస్‌ అనేది పరిశ్రమల యజమానులు ఐచ్ఛికంగా, బహుమతిగా ఇచ్చేది అన్న వాదన చివరికి వీగిపోయింది . యజమానుల లాభంలో కార్మికుల అదనపు శ్రమ ఇమిడి వున్నందున్న లాభంలో వాటాగా బోనస్‌ చెల్లించాలన్న వాదన ఆధారంగా 1965 బోనస్‌ చట్టం వచ్చింది. కార్మికుల అదనపు శ్రమే యజమాని లాభం అన్న మార్క్స్ ‌విశ్లేషణను ఇది సమర్థించినట్లయింది. చట్టంలో నిర్దేశించిన ప్రకారం లాభంలో ఒక వాటాను వేరు చేసి విధిగా చెల్లించే పద్ధతి స్థిరపడింది.దీనికి తోడు
2013 లో కంపెనీల చట్టాన్ని సవరించారు. కార్పొరేట్‌ లాభాలలో 2 శాతాన్ని సమాజం కోసం ఖర్చు చెయ్యాలన్నది చట్టబద్ధం అయింది. వస్తువు తయారీలో యజమాని పొందే అదనపు శ్రమ లాభానికి మూలం అయినప్పటికీ ఆ వస్తువును సమాజం కొనుగోలు చేసినప్పుడే అది లాభంగా స్థిర రూపం పొందుతుంది అన్నది మార్క్స్ చేసిన విశ్లేషణే . లాభాలను సమాజానికి కూడా పంపిణీ చేయాలన్నదే ఈ సవరణ సారాంశం.
ఇవి అనేక లోటుపాట్లు వున్న అరకొర చర్యలే. కాని లాభాలకు శ్రమదోపిడీ మూలం అనీ దానిని కార్మికులకు, సమాజానికి హక్కుగా పంపిణీ చెయ్యాలన్న సూత్రాన్ని ఆవిష్కరించాయి. భవిష్యత్తులో సంపద పంపిణీకి ఇది దారులు వేస్తుంది .
3. సంపద పంపిణీకి ద్వారాలు తెరవాలి
అదనపు శ్రమ లాభాలకు మూలమైనట్లే "పోగుపడ్డ అదనపు శ్రమే" సంపద అన్నది మార్క్స్ విశ్లేషణ. లాభాలలో వాటా బోనస్‌గా కార్మికులకు, మరో వాటా సమాజం కోసం ఖర్చు చెయ్యడం చట్టబద్ధం అయినట్లే ఇప్పుడు పోగుపడ్డ సంపద పంపిణీని కూడా చట్టబద్ధం చెయ్యాలి.
కరోనా కల్లోలం సృష్టించిన, నిరుద్యోగాన్ని, అర్థాకలిని, అప్పుల వలయాన్ని అధిగమించడానికి "పన్నుల సొమ్ములు" అరకొరగా లాభాల వాటాలు సరిపోవు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి దీర్థకాలికంగా ప్రజలకు జీవించే హక్కును కల్పించడానికి మిగిలిన ఏకైక పరిష్కారం "పోగుపడ్డ సంపదను" పంపిణీ చెయ్యడమే. సంపద పంపిణీ జాతీయ చట్టం కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించే కార్యక్రమాలు తక్షణం ప్రారంభం కావాలి. సంపద పంపిణీ ద్వారా పేదలకు నగదు బదిలీ చేసే మౌలిక ఆదాయ కల్పనతో పాటు మొత్తం సమాజానికి బతుకు భరోసానిచ్చే మంచి ప్రమాణాల ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, ఉపాధి నైపుణ్యాలు అందించే ఏర్పాటు జరగాలి. ఈ అంశాలు పేదరికంలో వున్న కోట్లాది ప్రజలలో, మౌలిక సదుపాయాలు అందని ప్రజలందరిలో కొత్త ఆకాంక్షను రేకెత్తిస్తుంది. 10 శాతం మంది దగ్గర పోగుపడ్డ సంపదపై 70 శాతం ప్రజలు జరిపే ఉద్యమంగా అది విస్తరిస్తుంది. ఇప్పుడు సంపద పంపిణీకి ద్వారాలు తెరిస్తే అది భవిష్యత్తులో సంపద సమాజపరం కావాలన్న సమసమాజ ఆకాంక్షకు దారి తీస్తుంది. సంపద పంపిణీ ద్వారా జీవించే హక్కు ను సాధించడం అన్నది తక్షణ ప్రజా ఉద్యమ నినాదం కావాలి.
డి.వి.వి.ఎస్‌.వర్మ - 11th June 2021